ఆస్పత్రి పాలైన శివసేన నేత సంజయ్‌ రౌత్‌

ముంబై: శివసేన పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చేరారు. కాలు నొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరో మూడు రోజులు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని, చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కుటుంబసభ్యులు చెప్తున్నారు.











మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నేత సంజయ్‌రౌత్‌ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శివసేన అధినాయకత్వం వ్యూహాలకు అనుగుణంగా అటు బీజేపీని ఇరకాటంలో పెడుతూ.. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పొత్తుకు లైన్‌ క్లియర్‌ చేయడంలో సంజయ్‌ రౌత్‌ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తుండగా.. మరోవైపు ఆయన ఆస్పత్రి పాలుకావడం పార్టీ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసిందని చెప్పాలి.